వందో ఐపీఎల్ మ్యాచ్లో కెప్టెన్ లోకేశ్ రాహుల్ అజేయ శతకంతో అదరగొట్టడంతో భారీ స్కోరు చేసిన లక్నో.. ఆనక ముంబైని కట్టడి చేసి లీగ్లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ముంబై పరాజయం పాలైంది. బుమ్రా మినహా తక్కిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో లక్నో భారీ స్కోరు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగడంతో ముంబైకి ఆరోసారి నిరాశ తప్పలేదు.
ముంబై: భారీ ఆశలతో సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్కు ఈ సారి ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్-15లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రోహిత్ సేన వరుసగా ఆరో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. శనివారం జరిగిన తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఐపీఎల్లో వందో మ్యాచ్ ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. మనీశ్ పాండే (38; 6 ఫోర్లు), డికాక్ (24; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.
ముంబై బౌలర్లలో ఉనాద్కట్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (6) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ (37), బ్రేవిస్ (13 బంతుల్లో 31; 6 ఫోర్లు, ఒక సిక్సర్), తిలక్ వర్మ (26), పొలార్డ్ (25) తలా కొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా.. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్కు రూ. 12 లక్షల జరిమానా పడింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 199/4 (రాహుల్ 103; ఉనాద్కట్ 2/32), ముంబై: 20 ఓవర్లలో 181/9 (సూర్యకుమార్ 37, బ్రేవిస్ 31; అవేశ్ 3/30).