చర్మ సంరక్షణకు వంటింటి దినుసులు, సుగంధ ద్రవ్యాలు మేలు చేస్తాయని మనకు తెలుసు. కానీ వాటిని సరైన పద్ధతిలో వాడకపోతే ఫలితం ఉండదు. కొన్నిసార్లు నష్టమూ జరగొచ్చు.
ముల్తాని మట్టి ముఖం మీద జిడ్డును తొలగిస్తుంది. కానీ తేమ పూర్తిగా పోయి చర్మం పొడిబారుతుంది. చర్మంపై పగుళ్లు వచ్చి అందవిహీనంగా మారొచ్చు. అదే.. ముల్తాని మట్టిలో తేనె, పచ్చిపాలు, కొబ్బరినీళ్లు, బాదం నూనె కలిపి రాసుకుంటే చర్మానికి మంచి జరుగుతుంది.
నిమ్మరసంలో ఆమ్ల స్వభావం ఎక్కువ. కాలిన గాయాలు, పుండ్లు, దద్దుర్లపై రాస్తే మంటపుట్టడమే కాదు, దెబ్బ పెద్దదైపోతుంది. అదే.. రెండుమూడు నిమ్మ చుక్కల్ని చెంచా తేనెలో కలిపి రాసుకుంటే మాత్రం ఔషధంలా పనిచేస్తుంది. కాకపోతే, ఆ సమయంలో ఎండ సోకకుండా జాగ్రత్తపడాలి.
సున్నితమైన చర్మానికి సబ్బులు పడవు. సున్నిపిండి కూడా కొందరికి వికటిస్తుంది. చర్మం పొడిబారి పగుళ్లు వస్తాయి. అలాంటప్పుడు, బియ్యపు సున్నిపిండి స్థానంలో ఓట్స్ సున్నిపిండి వాడితే మేలు.
మీగడ, నూనెలు ఎక్కువగా రాస్తే జిడ్డు చర్మం ఉన్నవారిలో స్వేద రంధ్రాలు పూడిపోతాయి. కనుబొమల చుట్టూ, మెడభాగంలో నల్లగా మారుతుంది. మొటిమలు వస్తాయి.