పంట పండితే ధర ఉండదు. ధర ఉంటే పంట అంతంత మాత్రమే. నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్లే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆ గాయం కుటుంబాలనూ ప్రభావితం చేస్తున్నది. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వయోధికులకు నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నారు. ఆ సంక్షోభాన్ని కళ్లారా చూసినప్పుడు ప్రాణం పోసుకున్న ఆలోచనే.. ‘కోహ్’ఫుడ్స్. సూర్యాపేటకు చెందిన ఓడపల్లి కీర్తి ప్రియ తన సామాజిక వ్యాపారంతో తరాలనాటి సమస్యకు పరిష్కారం కనిపెట్టింది.
సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి కీర్తి ప్రియ స్వగ్రామం. బిట్స్ పిలానీలో బీ-ఫార్మసీ చేసింది. ఐఐఎం కోల్కతా నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. సెలవుల్లో సొంతూరికి వెళ్లినప్పుడు రైతుల సమస్యలను కళ్లారా చూసింది. గిట్టుబాటు ధర లభించక, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను.. రైతన్నలు వృథాగా పడేస్తున్న సంఘ టనలు ఆమెను కదిలించాయి. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నపుడు.. సులభంగా వండుకుని తినేందుకు వీలుగా అమ్మ పంపిన కాయగూరల ఒరుగులు గుర్తుకొచ్చాయి. అదే సూత్రాన్ని ఇక్కడా అన్వయించింది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సహజసిద్ధమైన పద్ధ్దతుల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే కాయగూరల ఒరుగులు, పొడుల తయారీకి శ్రీకారం చుట్టింది. అనారోగ్యకరమైన నూడుల్స్, పాస్తా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా మంచి ఆహార విధానాన్ని పరిచయం చేయాలన్నది ఆమె సంకల్పం. కార్పొరేట్ కంపెనీల్లో నేర్చుకున్న వ్యాపార మెలకువలు ఇప్పుడు ఉపయోగపడ్డాయి.
డీహైడ్రేషన్ పద్ధ్దతిలో తయారైన ఆహార ఉత్పత్తులు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే అందులో రసాయనాల ప్రభావం ఎక్కువ. తన ప్రొడక్ట్స్ అందుకు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది కీర్తి ప్రియ. రైతుల సహకారంతో సేంద్రియ విధానంలో కూరగాయలు పండించి, వాటితో కనుక ఆహార ఉత్పత్తులు అందిస్తే.. మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని భావించింది. ఆ ప్రయత్నంలో భాగంగా.. ఏ నేలలో ఏ రకం పంటలు పండుతాయో పరీక్షలు చేయించింది. ప్రత్యేక నిపుణులతో రైతులకు శిక్షణ ఇప్పించింది. కానీ, ఆరంభంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు ఆసక్తి చూపలేదు. నిదానంగా.. కీర్తి ప్రియ ఉద్దేశాన్ని అర్థంచేసుకున్నారు. మద్దతు పలికారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయలను అక్కడే ప్రాసెస్ చేసేలా తొండ తిరుమలగిరిలో ఓ యూనిట్ ఏర్పాటు చేసింది కీర్తి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి, పత్తి పంటలే ఎక్కువ. ఈ మధ్యకాలంలో కూరగాయలు పండించేవారి సంఖ్యా పెరిగిందని సగర్వంగా చెబుతున్నది కీర్తి ప్రియ. ఏడాది క్రితం ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు నుంచే కాదు.. ఇతర దేశాల నుంచీ ఆర్డర్లు పెరిగాయి. కొన్నవాళ్లు మళ్లీ మళ్లీ ఆర్డర్ చేస్తున్నారు.
కీర్తి ప్రియకు ఒక అక్క, ఒక చెల్లి. అమ్మ విజయలక్ష్మి గృహిణి. నాన్న వెంకన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్. అందరు అమ్మాయిల్లానే కీర్తి ప్రియ చిన్న తనంలో సమాజంలో కొంత వివక్షను ఎదుర్కొన్నది. అయినా సవాళ్లకు భయపడలేదు. తల్లిదండ్రులు సైతం స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించారు. చుట్టుపక్కల గ్రామాల మహిళల్లో సాధికారత తీసుకురావాలని సంకల్పించింది. తన కంపెనీలో సింహభాగం మహిళలకే ఉద్యోగాలు కల్పించింది. తమకంటూ ఓ ఆదాయమార్గం వచ్చాక.. వారి కళ్లలో ఆత్మవిశ్వాసం చూస్తున్నానని ఆనందంగా చెబుతున్నది కీర్తి. అమ్మాయిల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. ఏ విషయాన్ని అయినా వాళ్లు కీర్తి ప్రియతోనే చర్చిస్తున్నారు. ‘నా విజయం వెనుక మహిళల స్టార్టప్ వేదిక.. వీహబ్ సహకారం ఉంది. ఆ వేదిక వ్యాపార నైపుణ్యాలను బోధించింది. నిధులను సమకూర్చడంతోపాటు స్టార్టప్ ఇండియాను చేరుకోవడంలోనూ తోడ్పాటు అందించింది. నా చొరవతో రైతుల ఇబ్బందులు తీరాయి. మహిళలకూ ఆర్థిక స్వేచ్ఛ లభిస్తున్నది. భవిష్యత్తులో ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెంచి వ్యాపారాన్ని మరింత
విస్తరిస్తాను. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తాను’ అంటున్నది కీర్తి ప్రియ.
గంజి ప్రదీప్కుమార్