King charles | లండన్, మే 6: బ్రిటన్ సామ్రాజ్యానికి 40వ చక్రవర్తిగా చార్లెస్-3 పేరుతో చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ శనివారం లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకలో కింగ్ చార్లెస్కు చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆర్చ్ బిషప్ రాజమకుటాన్ని అలంకరించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతులు, ఆ దేశ మాజీ ప్రధానులు, పార్లమెంటు సభ్యులు, రాజ కుటుంబీకులు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణించిన తర్వాత బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సంప్రదాయం ప్రకారం పట్టాభిషేక వేడుక నిర్వహించారు.
అన్ని మతాలకు అవకాశం
బ్రిటన్ రాజు చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్కు కూడా అధిపతిగా కొనసాగుతారు. తరతరాలుగా పట్టాభిషేకం వేడుక పూర్తిగా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం కొనసాగుతున్నది. ఈసారి కూడా అదే విధానంలో వేడుకలు నిర్వహించినా, హిందూ, ముస్లిం, బౌద్ధ, యూదు తదితర మతాల ప్రతినిధులను కూడా వేడుకలకు ఆహ్వానించి గౌరవించారు.
పట్టాభిషిక్తుడైన అత్యంత వృద్ధుడిగా రికార్డు
పట్టాభిషేకం కోసం రాజభవనం బకింగ్హాం ప్యాలెస్ నుంచి కింగ్ చార్లెస్-3, ఆయన సతీమణి కెమిల్లా బంగారు పూత పూసిన స్టేట్ కోచ్లో వెస్ట్మినిస్టర్ అబేకు ప్రయాణించారు. రాజకుటుంబ సేవకులు 7 వేల మంది జయజయధ్వానాలు చేస్తుండగా, సంప్రదాయ దుస్తులు ధరించిన సైనికులు కవాతులు నిర్వహిస్తుండగా, సామాన్య ప్రజానీకం కేరింతల మధ్య రాజ దంపతులు బయలుదేరి వెళ్లారు. వెస్ట్మినిస్టర్ అబేలో రెండుగంటలపాటు పట్టాభిషేక క్రతువు సాగింది. కిరీట ధారణ అనంతరం సభికులంతా గాడ్ సేవ్ ది కింగ్ అని నినదించారు. కెమిల్లా క్వీన్ కన్సర్ట్గా, చార్లెస్ పెద్ద కుమారుడు విలియమ్ యువరాజుగా పట్టాభిషిక్తులయ్యారు. 76 ఏండ్ల చార్లెస్-3 బ్రిటన్ చరిత్రలో రాజుగా పట్టాభిషిక్తుడైన అత్యంత వృద్ధుడిగా రికార్డు నెలకొల్పారు.
భారత్తో ప్రత్యేక అనుబంధం
కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019 నవంబర్లో కూడా ఆయన భారత్కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్లో లండన్లో భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు.
ఫలక్నుమా ప్యాలెస్లో ప్రత్యక్ష ప్రసారం
హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): చార్లెస్-3 పట్టాభిషేకాన్ని హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వెన్ ఓవెన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాల నుంచి పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి డిప్యూటీ హై కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.