హైదరాబాద్, మార్చి 10 : విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పిల్లలు ఎవరూ మధ్యలో బడి మానేయడం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో (1-7 తరగతుల వరకు) డ్రాపౌట్ రేటు సున్నాగా నమోదైంది. ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూ-డైస్ ప్లస్) నివేదిక వెల్లడించింది. 2020-21 సంవత్సరానికి యూడైస్ నివేదికను తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం జాతీయ సగటు డ్రాపౌట్ రేటు ప్రాథమికలో 0.8, ప్రాథమికోన్నతలో 1.9 శాతంగా ఉన్నది. సెకండరీ స్థాయిలో (టెన్త్ వరకు) మాత్రం తెలంగాణలో డ్రాపౌట్రేటు 13.9గా నమోదైంది. అదే జాతీయ సగటు తీసుకొంటే 14.6 శాతంగా ఉండటం గమనార్హం. పై తరగతుల్లో చేరుతున్న వారి నిష్పత్తి రేటు ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత, ప్రాథమికోన్నత నుంచి సెకండరీ వరకు 100 శాతం ఉన్నది. అదే సెకండరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు (10 నుంచి 12 తరగతులు) 69.8 శాతం మాత్రమే నమోదైంది.
చదువుల అమ్మలు..
పిల్లల సంరక్షణేకాదు.. వారికి చదువు చెప్పడం, విద్యాబుద్ధులు నేర్పించడంలోనూ మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో మహిళా టీచర్లే అధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2019-20 సంవత్సరానికి మహిళా టీచర్లే అధికంగా ఉండగా, ఈ ఏడాది సైతం అదే సంప్రదాయం కొనసాగుతున్నది. అప్పట్లో 1,31,671 పురుషులు టీచర్లుగా ఉండగా, మహిళలు 1,73,926గా ఉన్నారు. క్రమంగా బోధనా వృత్తి నుంచి పురుషులు వైదొలగుతున్నట్టు, ఈ వృత్తిని మహిళలు కైవసం చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం టీచర్లలో 39 శాతం పురుషులు, 61 శాతం మహిళలు ఉన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులకు 99 శాతం మహిళా టీచర్లే బోధిస్తున్నారు.