మారేడ్పల్లి, డిసెంబర్ 24: మూడేండ్ల చిన్నారి కీర్తనను కిడ్నాప్ చేసిన మేనమామతో పాటు, అతడికి సహకరించిన మరో నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…సీతాఫల్మండికి చెందిన శిరివెల్లు సాయిరాం (25) కీర్తన తల్లి ఉమ చిన్నాన్న కుమారుడు. శ్రీనివాస్ ఉమ దంపతుల మెప్పు పొంది.. దగ్గర కావాలనే ఉద్దేశంతో వీరి పిల్లలను కిడ్నాప్ చేసి.. తానే విడిపించేలా నాటకం ఆడాలని పథకం పన్నాడు.
తనకు వరుసకు సోదరుడైన సఫిల్గూడ ప్రాంతానికి చెందిన బాలుడు (16), అతడి ఇద్దరు స్నేహితులతో కలిసి కిడ్నాప్ ప్లాన్ వేశాడు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చిన్నారి కీర్తన ఆడుకుంటుండగా, ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి.. జీడిమెట్లలో నివసించే సాయిరాం స్నేహితుడైన గువ్వల నితిన్ కుమార్ ఇంట్లో ఉంచారు.
టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు బృందాల వారీగా విడిపోయి.. సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నారు. కీర్తనను రక్షించి..తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సాయిరాం మొదట శ్రీనివాస్, ఉమ కుమారుడు తరుణ్ (6)ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. ఇందుకోసం అతడు చదివే పాఠశాల వద్దకు ఈ నెల 21న ముగ్గురిని పంపించాడు. అయితే వారు కొత్త వారు కావడంతో పాఠశాల సిబ్బంది తరుణ్ను పంపించేందుకు నిరాకరించినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత కీర్తనను అపహరించి.. పోలీసులకు సహకరిస్తున్నట్లుగా నాటకమాడిన సాయిరాం.. చివరికి దొరికిపోయాడు.