ధర్మపురి, డిసెంబర్ 14: ధర్మపురిలో మంగళవారం పట్టపగలు 23 ఏళ్ల యువతి కిడ్నాప్నకు యత్నించిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ కారులో నేరుగా యువతి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కారులో బలవంతగా తీసుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ కోటేశ్వర్ చుట్టు పక్కల పోలీస్స్టేషన్లకు సమాచారమందించి పోలీసులను అప్రమత్తంచేశారు. కిడ్నాపర్ల కారు మోరాయించడంతో ధర్మపురి దాటి వెళ్లలేకపోయారు. పోలీసులు, యువతి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, ధర్మపురికి చెందిన యువతి తల్లిదండ్రులు పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లగా ఆమె ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నది.
మధ్యాహ్నం ఏపీ 24ఏఈ 2270 నంబరు గల కారులో సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన మంగళారపు రాజేందర్, మరో ముగ్గురు యువతి ఇంటికి వచ్చారు. నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో నుంచి బలవంతగా ఎత్తుకొని కారులోకి ఎక్కించి కొంత దూరం వెళ్లారు. ధర్మపురి అంబేద్కర్ చౌక్ వద్దకు రాగానే వీరి కారు మొరాయించింది. దీంతో ఇద్దరు దుండగులు కారు దిగి కమలాపూర్ రోడ్డు వైపు గల ఓ ఫంక్షన్ హాల్ వరకు కారును తోసుకుంటూ వెళ్లారు.
అక్కడ డ్రైవర్ కూడా కారు దిగి కారు ఇంజిన్ను చూస్తుండగా.. డ్రైవర్ డోర్ లాక్ ఓపెన్ ఉండడంతో యువతి దుండగుల చెర నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఇళ్లల్లోకి పరుగెత్తింది. భయాందోళనకు గురైన దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకొని యువతిని, కారును స్టేషన్ను తరలించారు.