హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: సౌత్జోన్ జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్లో కర్ణాటక మహిళల జట్టు విజేతగా నిలిచింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లోని హ్యాండ్బాల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 14-13తో కేరళపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో కేరళ టైటిల్ చేజిక్కించుకోగా.. కర్ణాటక రన్నరప్గా నిలిచింది. తెలంగాణ మూడో స్థానం దక్కించుకుంది. విజేతలకు జాతీయ ఖోఖో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫెడరేషన్ కప్లో పాల్గొంటాయి. ప్రో కబడ్డీ తరహాలో వచ్చే ఏడాది మార్చిలో ప్రో ఖోఖో లీగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి కోట్ల రామకృష్ణ, నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.