ఖమ్మం అర్బన్, ఆగస్టు 3 : ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఓ వీడియో రికార్డు చేసి ఆదివారం సోషల్మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బీ గౌతమి.. ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారంటూ జనవరి 21న డీఈవో సస్పెండ్ చేశారు.
తన తప్పును క్షమించి, సస్పెన్షన్ను రద్దుచేయాలని విన్నవించుకునేందుకు అప్పటి డీఈవో వద్దకు వెళితే.. ‘నా దగ్గరకు రాకు.. వెళ్లిపో..’ అంటూ చీదరించుకున్నారని కంటతడి పెట్టారు. విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయురాలికి ఈ ఏడాది జూలై 17న ఖమ్మం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇవ్వగా విధుల్లో చేరారు. శనివారం ఖమ్మం డీఈవో కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను డీఈవో, డీఈవో ఏడీకి అందజేశారు. కాగా సస్పెన్షన్ సమయంలో ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు వారు తనపట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.