సత్తుపల్లి రూరల్, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ విజిలెన్స్ డీఈఈ కే. హీరాలాల్ అన్నారు. పట్టణంలో కాకర్లపల్లి ఫీడర్పై ఎక్కువ నష్టం వస్తుండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 25 బృందాలుగా ఏర్పడి శుక్రవారం పోల్ టూ పోల్ తనిఖీలు నిర్వహించారు. ఈ ఫీడర్లో 1768 విద్యుత్ సర్వీసులు ఉండగా దానికి తగ్గట్లుగా రెవెన్యూ రాకపోవడంతో తనిఖీలు చేపట్టి అదనపు డెవలప్మెంట్ చార్జీల కింద రూ. 35 వేలు విధించారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లో అధికారులతో కలిసి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు 100 యూనిట్ల రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ సేవాలో రూ.970లు చెల్లించి కులధ్రువీకరణ పత్రం కార్యాలయానికి అందజేస్తే ఈ పథకం వర్తిస్తుందన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. తనిఖీల్లో కొన్ని మీటర్లకు సీల్ వేశామని, ఆగిన మీటర్లను మార్చా మన్నారు. సత్తుపల్లి విద్యుత్ శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏడీఈలు నాగార్జున, కిరణ్కుమార్, ఏఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.