గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్కారు విద్యకు తక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు క్రమక్రమంగా మూతబడుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ పాఠశాలలకు పెద్దపీట వేశాయి. ఫలితంగా ప్రభుత్వ బడులకు ఆదరణ కరువైంది. కాని తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎన్నో సంస్కరణలు చేపట్టింది. మెరుగైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకున్నది. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ఇంగ్లిష్ మీడియం అందించేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య చేరువ కానున్నది. సొంతూళ్లోనే ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకు వెసులుబాటు కలగనున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బీజం పడనున్నది.
ప్రభుత్వ బడి.. సౌకర్యాల ఒడి..
ఇక చెట్ల కింద బోధనకు కాలం చెల్లింది. అరకొర తరగతి గదుల్లో చదవాల్సిన పనిలేదు. ప్రతీ పాఠశాలలో నూతన తరగతి గదులను నిర్మించనున్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించనున్నారు. విద్యార్థులకు వేడి వేడి భోజనం అందించేందుకు వీలుగా కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్స్ నిర్మించనున్నారు. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థినులకు అలాంటి సమస్య లేకుండా నీటిసౌకర్యంతో కూడిన టాయిలెట్లు సమకూర్చనున్నారు. వీటితోపాటు విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నీచర్, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం తదితర సమస్యలను మన ఊరి.. మన బడి కార్యక్రమంలో పరిష్కరించనున్నారు.
డిజిటల్ విద్య అమలు..
సాంకేతిక రంగం విస్తరిస్తోంది. విద్యార్థుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది. చిన్న వయస్సులోనే కంప్యూటర్లో నైపుణ్యం సాధిస్తున్నారు. వారికి ఉన్న పరిజ్ఞానంతో డిజిటల్ బోధన సులభతరం కానున్నంది. సమాజంలో మార్పులకు అనుగుణంగా తరగతి గదులను మార్పు చేస్తూ ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, టీవీలతో బోధించడం ద్వారా విద్యార్థులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అవసరమని భావించి విద్యార్థి దశ నుంచే డిజిటల్ బోధన అందించాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది. సాధారణ బోధన కంటే డిజిటల్ (స్క్రీన్ పై) విద్యను అందించడం ద్వారా విద్యార్థులు పాఠాలను త్వరితగతిన అవగతం చేసుకుంటారు. డిజిటల్ బోధనతో సర్కారు విద్య బలోపేతం కానున్నది.
డిజిటల్ విద్యకు రోల్మోడల్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌస్తో ప్రాజెక్టర్పై బోధించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూల్స్కు మార్పించేందుకు ఆలోచన చేస్తున్న సమయంలో డిజిటల్ విద్య ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు రోల్మోడల్గా నిలువనున్నాయి. విద్యార్థుల సంఖ్య కూడా పెరుగనున్నది.
సర్కారు పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ బడులంటే ఈసడించుకునే రోజులు పోయాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ విద్య మసకబారింది. కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేస్తూ సర్కారు బడులను నిర్వీర్యం చేశాయి. కాని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు పాఠశాలలకు ఊపిరి పోస్తున్నారు. వాటిని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. విద్యాహక్కు చట్టంతో పాఠశాల పనివేళల్లో మార్పు తీసుకొచ్చారు. అంతేకాదు, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, రెండు జతల దుస్తులు, బాలికలకు హైజనిక్ కిట్లు అందిస్తున్నారు. తాజాగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు సంకల్పించారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచి నిర్ణయం..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచన బాగుంది. మంత్రి వర్గ క్యాబినెట్లో బడుల బలోపేతానికి రూ.7,289కోట్లు కేటాయించేలా ప్రకటన చేయడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపింది. సీఎం కేసీఆర్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్యను చేరువ చేయడం అభినందనీయం.
అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యార్థులకు ఉజ్వల్ భవిష్యత్ ఉంటుంది. అవకాశాలు మెరుగుపడతాయి. అన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా తయారవుతాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుంది.
-దెందుకూరి వెంకటరామన్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు