అశ్వారావుపేట, నవంబర్ 28: ఆయిల్పాం రైతుల సమస్యల పరిష్కారానికి పామాయిల్ ఫార్మర్స్ సంఘం నాయకులు సహకరించాలని టీఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. నారంవారిగూడెంలోని ఆయిల్ఫెడ్ కార్యాలయంలో సోమవారం రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్తో కలిసి రైతు సంఘం నేతలతో చర్చించారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ.. ఇప్పటికే నకిలీ ఎఫ్-కోడ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత కార్డులను పరిశీలించి అసలు రైతులకు మాత్రమే ఎఫ్-కోడ్స్ ఇస్తామన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ఆయిల్పాం రైతుల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ డైరెక్టర్లు కాసాని చంద్రమోహన్, తాడేపల్లి రవి, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గెలలు చేతికి వచ్చే జూన్- సెప్టెంబర్లో ప్రతి ఆదివారం ఆయిల్ పాం ఫ్యాక్టరీలో అన్లోడింగ్ను నిలిపివేస్తే రైతులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నకిలీ ఎఫ్-కోడ్ కార్డులను రద్దు చేయాలన్నారు. డిస్కం ఏడీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పామాయిల్ ఫ్యాక్టరీలో విద్యుత్ సరఫరా అంతరాయ సమస్యల నివారణకు ఎస్టిమేషన్ సొమ్ము చెల్లించాలన్నారు.
ఆయిల్ మొక్కల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కంచర్ల
టీఎస్ ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా అయిల్పాం మొక్కలు తరలివెళ్తున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే నేరుగా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్తో మాట్లాడామన్నారు. అక్ర మార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల అక్రమ రవాణాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే నలుగురు వ్యక్తులను గుర్తించామన్నారు. వారిపై ప్రాథమిక సమాచార నివేదిక ఆధారంగా విచారణ సాగుతున్నదన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల పరిధిలోని ఐదు గ్రామాల్లో ఆయిల్పాం మొక్కలు దుర్వినియోగం అయ్యాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ ఉన్నారు.