పాల్వంచ రూరల్, నవంబర్ 28: భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆరో ఇంటర్ లీగ్ సొసైటీ క్రీడలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి మల్లయ్య భట్టు మార్చ్ఫాస్ట్ను తిలకించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఏడు సొసైటీల నుంచి 3,200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
క్రీడలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఇందుకోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయిలో రాణించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరో ఇంటర్ లీగ్ సొసైటీ క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గెలుపోటములకు అతీతంగా ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో క్రీడలతోపాటు విద్యావ్యవస్థనూ బలోపేతం చేస్తున్నారని అన్నారు. 119 నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన గురుకులాల్లో వేలాదిమంది విద్యార్థులకు గుణాత్మక విద్యనందిస్తున్నారని వివరించారు.
కిన్నెరసాని క్రీడా మైదానంలో క్రీడలు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించేందకు గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనిన అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. విద్యార్థుల దైనందిన కార్యక్రమాల్లో క్రీడలూ భాగం కావాలని ఆకాంక్షించారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ విజేతలేనని, గెలుపోటములను సమానంగా తీసుకొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు మాట్లాడుతూ.. ఏడు గురుకులాల సొసైటీల నుంచి సుమారు 3,200కు పైగా విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు.గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి మల్లయ్య భట్టు, రమణకుమార్, మైనార్టీ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా ఖాన్, ఐటీడీఏ పీవోలు వరుణ్రెడ్డి, కృష్ణాదిత్య, ఎంపీపీ మడి సరస్వతి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సర్పంచ్ వీరకుమారి, ఇన్చార్జి ఆర్సీవో డేవిడ్రాజ్, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ రమాదేవి, క్రీడా ప్రముఖులు తానాజీ, వీరూనాయక్, చంద్రమోహన్, రూపాదేవి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ను అధికారులు వీక్షించి వారి నుంచి గౌరవందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్ కాంతారావు క్రీడా జ్యోతిని వెలిగించారు.