ఏన్కూరు, నవంబర్ 16 : పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలు అందజేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం ఏన్కూరు మండలంలోని మూలపోచారం గ్రామపంచాయతీలో ఉన్న రంగాపురం గ్రామంలో పోడు భూముల సమస్యలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గిరివికాస పథకం కింద బోర్లు, విద్యుత్ మంజూరైనప్పటికీ ఫారెస్టు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, బేస్క్యాంపుల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఫారెస్టు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరివికాస పథకం కింద మంజూరైన బోర్లు, విద్యుత్ లైన్లు 15రోజుల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణ, గిరిజన హక్కులను కాపాడ్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దరఖాస్తులు చేసేటప్పుడు, పట్టాల మంజూరు విషయంలో అధికారులు, రాజకీయ నాయకులు లంచాలు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామంలో ఆశ్రమ పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని తెలుసుకున్నారు. గ్రామానికి ఎలాంటి ఫోన్సిగ్నల్ అం దడం లేదని ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ దానిపై టెలికాం కంపెనీతో మాట్లాడి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి సంజయ్కుమార్, తహసీల్దార్ మొహమ్మద్ షాఖాసీం, ఎంపీడీవో బయ్యారపు అశోక్, సర్పంచ్ ముక్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.