ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అవిభాజ్య ఖమ్మం జిల్లా పరిధిలో స్థానిక సంస్థల నియోజకవర్గం ఉండగా.. సుమారు 767 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ నెల 23వ తేదీ వరకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నిక విధి, విధానాలకు సంబంధించి కలెక్టర్ అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేశారు.
ఖమ్మం, నవంబరు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్ను మంగళవారం కలెక్టర్ వీపీ గౌతమ్ విడుదల చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో, తహసీల్దార్, మండల పరిషత్, నగర పాలక, అన్ని పురపాలికలు, డీపీవో, జడ్పీ కార్యాలయాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ మంగళవారం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19, 21 తేదీ (సెలవు రోజులు) మినహా ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉంటుందని తెలిపారు. నామినేషన్ ఫారాలను కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగంలో అందుబాటులో ఉంచామన్నారు. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, జిల్లాలో మొత్తం 768 మంది ఓటర్లతో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు చెప్పారు.
23 వరకు గడువు
రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ వీపీ.గౌతమ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలుకు 23వ తేదీ వరకు గడువు ఉంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. వచ్చేనెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 14వ తేదీన ఓట్ల లెక్కించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది.
ముగియనున్న పదవీ కాలం
స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రస్తుతం బాలసాని లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం జనవరి 4వ తేదీన ముగియనున్నది. దీంతో ఎన్నికల కమిషన్ ఈ పదవికి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయి మెజార్టీ టీఆర్ఎస్కు ఉండడంతో గెలుపు సునాయాసమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎన్నికేదైనా విజయం టీఆర్ఎస్దేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీకావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.
గులాబీదే గెలుపు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల బరిలో దిగుతాయా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. పలు రాజకీయ పక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నా.. పూర్తి మెజార్టీ కలిగిన టీఆర్ఎస్ను ఎదుర్కోవడం సాధ్యం కాదు. దీంతో ఆయా రాజకీయ పక్షాలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీచేసే అభ్యర్థిని 10 మంది స్థానిక సంస్థల నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారమే వెలువడడం.. నామినేషన్ల దాఖలుకు ఇంకా సమయం ఉండడంతో ఆయా రాజకీయ పక్షాల్లో ఎన్నికల పోటీ అంశంపై చర్చలు నడుస్తున్నాయి.