బూర్గంపహాడ్, డిసెంబర్ 2: వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఎస్పీ సునీల్దత్తో కలిసి బూర్గంపహాడ్ మండలంలో ఆయన పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు కొనుగోలు నిమిత్తం తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ను చెక్ చేసి రైతులతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాంటివేమీ లేవని అన్నదాతలు సమాధానమివ్వడతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏఎంసీ సెక్రటరీ నిర్మలతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు, యార్డుకు వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి గోదాములకు తరలించాలని సూచించారు. అనంతరం బూర్గంపహాడ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టును పరిశీలించారు. అనుమతులు లేకుండా ధాన్యం తరలించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మోరంపల్లి బంజర్ సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ధాన్యాన్ని పరిశీలించి కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీఎస్వో చంద్రప్రకాశ్, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, ఎంపీవో సునీల్కుమార్, ఏఎంసీ సెక్రటరీ నిర్మల, సొసైటీ సీఈవో ప్రసాద్, సివిల్ సప్లయి డీటీ వెంకటేశ్వర్లు, ఎస్సై జితేందర్, సర్పంచ్ సిరిపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యలు కలెక్టర్ దృష్టి..
తేమ శాతం వచ్చిన తర్వాతే ధాన్యాన్ని యార్డుకు తేవాలని ఏఎంసీ అధికారులు నిబంధన పెట్టడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు తమకు ఇబ్బంది అవుతోందంటూ రైతులు తహసీల్దార్ భగవాన్రెడ్డికి విన్నవించారు. ఇదే విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి యార్డులో ధాన్యం ఆరబెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏఎంసీ సెక్రటరీ నిర్మలను ఆదేశించారు.
చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాలి: కలెక్టర్
భద్రాచలం, డిసెంబర్ 2: ఇతర రాష్ర్టాల నుంచి ఒక్క గింజ కూడా ధాన్యం రాకుండా 24 గంటల పాటు చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. స్థానిక కూనవరం రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఎస్పీ సునీల్దత్తో కలిసి గురువారం పరిశీలించారు. రోజుకు మూడు షిఫ్టులు విధులు నిర్వహిస్తూ నిరంతరం లారీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్యాదవ్, డీటీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.