వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో భారత దౌత్య కార్యాలయంపై శనివారం దాడికి ఖలిస్థాన్ మద్దతుదారులు విఫలయత్నం చేశారు. వీరి కుట్రను ముందే పసిగట్టిన అమెరికా సీక్రెట్ సర్వీస్, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో దాడి కుట్ర భగ్నమైంది. పలువురు వేర్పాటువాద సిక్కులు భారత్పై విద్వేషాన్ని రెచ్చగొడుతూ దౌత్యకార్యాలయంపై దాడులకు పురిగొల్పేలా ప్రసంగాలు చేశారు. ఇప్పటికే లండన్, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాలపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న యూఎస్ సీక్రెట్ సర్వీస్, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆందోళనకారులను నిలువరించారు.
పీటీఐ జర్నలిస్టుపై దాడి
వాషింగ్టన్లోని భారత దౌత్య కార్యాలయం వద్ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) జర్నలిస్టు లలిత్ కే ఝాపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై దాడికి సమీపంలోని పార్కు నుంచి ఆందోళనకారులు కర్రలు తెస్తుండగా పీటీఐ జర్నలిస్టు కవర్ చేస్తుండటంతో కొందరు ఆందోళనకారులు ఆయనను బూతులు తిడుతూ దాడి చేశారు. దీంతో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనను రక్షించారు. ఆందోళనలో ప్రసంగిస్తున్న వారు కూడా పదే పదే భారతీయ జర్నలిస్టులను దూషించారు.
కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల విధ్వంసక చర్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లోని కెనడా హైకమిషనర్ కామెరూన్ మెక్కేకు సమన్లు జారీ చేసింది. భారత దౌత్య కార్యాలయాల వద్ద పోలీసులు ఉన్నా కూడా వేర్పాటువాదులు, తీవ్రవాదులు ఎలా భద్రతను ఉల్లంఘించి విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.