ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మాటలకు, చేతలకు పొంతనే ఉండదని ఎద్దేవా చేశారు. ప్రధాని శనివారం అహ్మదాబాద్లో జరిగిన ఖాదీ ఉత్సవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న, స్వావలంభన భారత్ కలలు సాకారం కావడానికి ఖాదీ ఒక ఆదర్శక వనరు అని వ్యాఖ్యానించారు.
ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఖాదీని వినియోగించాలని గొప్పలు చెబుతూనే జాతీయ జెండాకు మాత్రం చైనీస్ పాలిస్టర్ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలకు, చేతలకూ ఎప్పుడూ పొంతన కుదరదని దుయ్యబట్టారు. ఫ్లాగ్ కోడ్ సవరణలు చేసినప్పుడే కేంద్ర సర్కారును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించిందని గుర్తుచేశారు.
గతంలో మిషన్ మీద తయారైన, పాలిస్టర్ వస్త్రంతో తయారుచేసిన జాతీయ జెండాలకు అనుమతి ఉండేది కాదని, కానీ కేంద్రం ఫ్లాగ్ కోడ్కు సవరణలు చేసి వాటికి అనుమతించిందని రాహుల్గాంధీ చెప్పారు. ఇప్పుడు జాతీయ జెండాల తయారీకి చైనీస్ పాలిస్టర్ను వినియోగిస్తున్నారని విమర్శించారు.