పల్లె రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలోనూ పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తున్నది. అయితే, పెరుగుతున్న కాలుష్యం మనుషులతోపాటు పశువుల్లోనూ పలు రకాల వ్యాధులకు కారణం అవుతున్నది. ఈ క్రమంలో పశువుల పెంపకం, వాటి ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
మనుషులకే కాదు.. పశువులకూ పౌష్టికాహారం తప్పనిసరి. అందుకే, పోషక విలువలున్న గడ్డితోపాటు ఔషధ గుణాలుండే కొన్ని రకాల దినుసులనూ జీవాల ఆహారంలో చేర్చాలి. అప్పుడే వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందుకోసం ప్రకృతిలో లభించే సకల పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన ‘హెర్బల్ మిక్సర్’ను తయారు చేసుకోవాలి.
హెర్బల్ మిక్సర్ తయారీ విధానం..
కావలసిన పదార్థాలు :
ఉలువలు : 1.5 కిలోలు, తాటి బెల్లం : 1.5 కిలోలు, యాలకులు : 50 గ్రా., లవంగాలు : 100 గ్రా., సొంఠి : 200 గ్రా., మిరియాలు : 150 గ్రా., తోక మిరియాలు : 50 గ్రాములు, పిప్పళ్లు : 50 గ్రా., వాము : 200 గ్రా., పాల ఇంగువ : 100 గ్రా., వెల్లుల్లి : 300 గ్రా., మెంతులు : 150 గ్రా., మోదుగుపువ్వు : 300 గ్రా, దాల్చిన చెక్క : 50 గ్రా., నల్ల నువ్వులు లేదా వేరు పిసరాకు : 1.5 గ్రా.
తయారీ విధానం :
పైన చెప్పిన దినుసులన్నిటినీ మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక లీటర్ దాకా ఆవ నూనె కలుపుకొని తడి తగలకుండా డబ్బాలో నింపుకోవాలి. దీనికి ఎండవేడి తగలకుండా ఉంచితే, రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ హెర్బల్ మిక్సర్ను పశువులకు నెలలో 15 రోజులు వాడితే సరిపోతుంది. పాలిచ్చే పశువులకు రోజుకు 50 గ్రాముల చొప్పున తినిపించాలి. రెండు నెలలు దాటిన దూడలకు వయసును బట్టి 5 గ్రా. నుంచి 20 గ్రా. మోతాదులో తినిపించాలి. దీనివల్ల పశువుల్లో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వాటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడే సీజనల్గా వచ్చే పలు రకాల వ్యాధులను సమర్థంగా తట్టుకొంటాయి.