నల్లగొండ ప్రతినిధి, మార్చి29(నమస్తే తెలంగాణ) : ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోపాటు సాగునీటి ప్రణాళిక కొరవడడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పర్యటించారు. రైతుల ఇబ్బందులు, నష్టం, ప్రభుత్వం తీరు తదితర అంశాలను పరిశీలించారు. రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. ఇదే సందర్భంగా గతంలో కేసీఆర్ సర్కార్ ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించిందో కూడా గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల బాధ్యతారహిత వైఖరిని కూడా ఎండ గట్టారు. తన పర్యటనలో గుర్తించిన అంశాలను ఒక నివేదికగా పార్టీ అధినేత కేసీఆర్కు జగదీశ్ రెడ్డి అందజేశారు. కరువు పరిస్థితులు, రైతుల ఇక్కట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణి వంటి అంశాలపై శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి జగదీశ్రెడ్డి..ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిసి కేసీఆర్తో చర్చించారు. దాంతో కేసీఆర్ చలించిపోయినట్లు తెలిసింది. వెంటనే రైతుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, ధైర్యం చెప్పేందుకు తానే జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 31వ తేదీన కేసీఆర్ పర్యటనను అక్కడికక్కడే ఖరారు చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ముందుగా జనగాం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తారు. అక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేటకు చేరుకొని మీడియా సమావేశంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటిస్తారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో భేటీ అవుతారు. తరువాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నట్లు తెలిసింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్పై శనివారం స్పష్టత రానుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాథమికంగా ఖరారైన ప్రకారం పార్టీ నేతలు అధినేత పర్యటన ఏర్పాట్లపై దృష్టి సారించారు.