హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి పార్టీ విస్తృతస్థాయి సమావేశం వేదికగా ప్రకటన చేశారు. టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17న షెడ్యూల్ విడుదల చేయగా, 22 వరకు పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. ఇతరులెవ్వరూ పోటీగా నామినేషన్లు వేయకపోవటంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు హర్షధ్వానాల మధ్య శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇది 9వ సంస్థాగత ఎన్నిక. చివరిసారి 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించలేదు.
అభివృద్ధి కొత్త పుంతలు
కొత్త అధ్యక్షుడిని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత బలపర్చారు. కేసీఆర్ మానవీయ మూర్తిగా సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించారన్నారు. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి రాష్ట్ర ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి, సంపదను పేదలకు పంచారని తెలిపారు. సాగునీటి రంగ నిపుణుడిగా మారి, నిరంతరం అధ్యయనంతో ప్రాజెక్టులు రీ డిజైన్ చేశారని, పరిపాలనా సంస్కరణలతో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారని కొనియాడారు. టీఆర్ఎస్ విజయ ప్రస్థానానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ప్రతి కార్యకర్త గర్వంతో ఉప్పొంగిపోయే ఘనకీర్తిని అందించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ రికార్డు
ఒక ప్రాంతీయ పార్టీ పగ్గాలు తొమ్మిదోసారి
దేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి రెండు దశాబ్దాల నుంచి వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతూ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ సైతం ఆ పార్టీకి రెండుదశాబ్దాలపాటు అధ్యక్షునిగా కొనసాగలేదు. టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు రెండున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతున్నప్పటికీ దాన్ని జాతీయ పార్టీగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించినప్పటి నుంచి అధ్యక్షునిగా కొనసాగుతున్న కేసీఆర్ను టీఆర్ఎస్ తాజాగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది. దీంతో ఆయన మరో నాలుగేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏ రాష్ర్టానికైనా ప్రాంతీయ పార్టీలే గుండెకాయ. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ప్రాంతీయ పార్టీకే సాధ్యమవుతుందని, ఆ శక్తి, యుక్తి టీఆర్ఎస్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీకే ఉంటుందని నిరూపించిన నాయకుడు కేసీఆరే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తానే సర్వస్వమై అసాధ్యమనుకున్న స్వరాష్ర్టాన్ని సుసాధ్యం చేసి ఉద్యమ సారథిగా వర్తమాన దేశ రాజకీయాల్లో నిలువెత్తున నిలిచిన ఏకైక నాయకుడు కూడా కేసీఆరే. కఠోర శ్రమ, పట్టుదల, దీక్ష, దక్షతతో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను రెండు దశాబ్దాల నుంచి నడపడంలో కేసీఆర్ సఫలీకృతులయ్యారనడానికి ఆ పార్టీకి ఉన్న 60 లక్షల మంది సభ్యులే నిదర్శనం. ప్రాంతీయ పార్టీ అధినేతగానే కాకుండా జాతీ య స్థాయిలో దక్షిణాది నుంచి తిరుగులేని నేతగా ఎదిగింది కూడా కేసీఆర్ ఒక్కరే.