ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 22 : ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, అందుకు సీఎం కేసీఆర్ గర్భిణులకు అందిస్తున్న కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని పుత్లిబౌలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భిణి ఈ కిట్లో ఉన్న పౌష్టికాహార పదార్థాలు తప్పనిసరిగా తినాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీశ్, లక్ష్మణ్, పీహెచ్సీ డాక్టర్ వినోద్, నాయకులు శ్రీనివాస్, సాజిదొద్దీన్ పాల్గొన్నారు.
సుందరీకరణ పనులకు భూమి పూజ
పట్టణ సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద చౌక్ అభివృద్ధి పనులకు అఖిల పక్ష రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని చౌక్ల అభివృద్ధి పనులు జనవరి లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో..
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దస్నాపూర్ సబ్ సెంటర్కు సంబంధించిన 70 మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు డాక్టర్ రాహుల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూట్రిషన్ కిట్లలోని పౌష్టికాహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది లక్ష్మి, యశోద, ఈశ్వర్ రెడ్డి, ముంతాజ్, శకుంతల, అనిత, పార్వతి, ప్రమీల పాల్గొన్నారు.