మహబూబ్నగర్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండలం కోడూరు, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, మాచన్పల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్కార్డులు పంపిణీ చేశారు.
దేశంలో తెలంగాణను నెంబర్వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అనేక రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేండ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. పింఛన్లు తీసుకుంటున్నోళ్లు కేసీఆర్ను, టీఆర్ఎస్ను మరిచిపోరని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తమైతే ప్రపంచంలోనే దేశం నెంబర్వన్ అవుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ రైతులకు ఇస్తుంటే ఓర్వలేని కేంద్రం బాయికాడ మోటర్లకు మీటర్లు బిగించమని ఒత్తిడి తెస్తున్నదని విమర్శించారు.