హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు లభించడం తెలంగాణ ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు. కేసీఆర్లో అణువణువునా ఉన్న తెలంగాణ తపనతోనే అభివృద్ధి, సంక్షేమరంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. సీఎంను విమర్శించే పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇంతకంటే మేలైన పాలన ఇస్తున్నామా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో కేశవరావు ప్రారంభోపన్యాసం చేశారు. హింస లేని ఉద్యమాలు గమ్యాన్ని చేరుతాయనే విశ్వాసంతో గాంధేయ పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, ఫలితం రాబట్టిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. 13 ఏండ్ల ఉద్యమం, ఏడున్నరేండ్ల పాలనతో టీఆర్ఎస్ను సబ్బండవర్ణాల పార్టీగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాథమిక లక్ష్యాలు చాలా వరకు నెరవేరడం ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. తెలంగాణ సాధించిన పార్టీగా 2014లో 63 సీట్లు పొందిన టీఆర్ఎస్ 2018లో 88 స్థానాలు గెలుపొందడం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్న ఫలితంగా తెంగాణ రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా గుండె మీద చేయి వేసుకొని ఒక నిమిషం ఆలోచిస్తే, అప్పటి, ఇప్పటి తెలంగాణకు తేడా అర్థమవుతుందని పేర్కొన్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు కొందరు ఉద్యమవీరుడు, అభివృద్ధి సూరీడు అయిన కేసీఆర్ను అసభ్యకర భాష (అన్ పార్లమెంటరీ)తో నిందిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని కేశవరావు హితవు చెప్పారు. తెలంగాణ రాజకీయాలు తిట్ల రహితంగా సాగాలని, సోషల్ మీడియాను తిట్ల కోసం కాకుండా నిర్మాణాత్మక సూచనలకు వేదికగా మార్చుకొంటే అందరికీ మంచిదని సూచించారు. తెలంగాణ ఆత్మ కేసీఆర్.. తెలంగాణ గుండె కేసీఆర్.. ప్రజల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కేసీఆర్ నాయకత్వంలో పార్టీ రానున్న రోజుల్లో మరింతగా బలపడి అప్రతిహత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.