బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న పదేండ్ల విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. అంతేగాక స్కూల్ భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థిపై దాడి చేస్తున్నప్పుడు అడ్డు వచ్చిన అతడి తల్లిని కూడా ఉపాధ్యాయుడు దాడిచేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం గడక్ జిల్లాలోని హగ్లీ గ్రామంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ముత్తప్ప హడగలి అనే వ్యక్తి కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం భరత్ అనే నాలుగు తరగతి విద్యార్థిని ముత్తప్ప తీవ్రంగా కొట్టాడు. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భరత్ తల్లి గీతా బార్కర్ అడ్డురాగా ఆమెపై కూడా ముత్తప్ప దాడికి పాల్పడ్డాడు.
అడ్డుచెప్పబోయిన మరో ఉపాధ్యాయుడు నంగన్గౌడ పాటిల్ మీద కూడా ముత్తప్త దాడి చేశాడు. ఈ క్రమంలోనే ముత్తప్ప భరత్ను తీవ్రంగా కొట్టి మొదటి అంతస్తు నుంచి కిందకు తోశాడు. దాంతో భరత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భరత్ తల్లి గీతా బార్కర్, మరో ఉపాధ్యాయుడు నంగనగౌడకు తీవ్ర గాయాలయ్యాయి.
బాలుడి హత్యకు సంబంధించిన సమాచారం అందగానే తాము ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని గడక్ జిల్లా ఎస్పీ శివప్రకాశ్ దేవరాజు చెప్పారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామన్నారు. గాయపడిన గీతా బార్కర్, నంగన గౌడలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.