మంథని, సెప్టెంబర్ 3: ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తూ అభాగ్యులకు భరోసానిస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఈ స్కీంను నిర్విఘ్నంగా అమలు చేసిందని చెప్పారు. శనివారం మంథని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా 57 ఏండ్లకే పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు.
సాంకేతిక కారణాలతో కొందరికీ పింఛన్లు మంజూరుకాలేదని, త్వరలోనే అర్హులందరికీ అందజేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారికి ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధి, టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే. రవి, నక్క నాగేంద్ర శంకర్, కొట్టె పద్మారమేశ్, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, శ్రీపతి బాణయ్య, గుండా విజయలక్ష్మి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల కిరణ్ పాల్గొన్నారు.