హుజురాబాద్టౌన్, డిసెంబర్ 2: దళిత బంధు పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. దళితబంధు పథకం ద్వారా ట్రాన్స్పోర్ట్, హార్వెస్టర్, ట్రాక్టర్ పథకాలకు ఎంపికైన వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం హుజూరాబాద్ పట్టణంలోని జూనియర్, డిగ్రీకళాశాలల క్రీడామైదానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ అధ్యక్షతన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని 13,139 మంది లబ్ధిదారుల్లో 6,800 మంది ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఎంపికైనట్లు తెలిపారు. దీని కోసం 10 స్టాల్స్ను ఏర్పాటు చేయగా పలువురు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చుకున్నారని తెలిపారు. మూడు రోజుల శిక్షణ సందర్భంగా ఒక్కోరోజు 200 మంది లైసెన్స్ పొందేందుకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించామన్నారు. గతంలో పాడిపరిశ్రమ కోసం ఎంపికైన 1103 లబ్ధిదారులకు కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. డ్రైవింగ్ రాని లబ్ధిదారులకు 30 రోజుల పాటు శిక్షణ ఇచ్చి లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ రామ్రెడ్డి, హుజూరాబాద్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిరాజ్ ఉర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనత నుంచి మహిళలను రక్షించాలి
హుజురాబాద్టౌన్, డిసెంబర్ 2: రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను రక్షించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వైద్య, అంగన్వాడీ ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం హుజూరాబాద్లోని మామిండ్లవాడ హెల్త్ సబ్ సెంటర్లో 33 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించి, అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒకరూ తప్పనిసరిగా మాసులు ధరించి, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. రక్త హీనతతో బాధపడుతున్న పలువురు మహిళలకు మూడు నెలల కోర్స్కు సంబంధించిన ఐరన్ మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో భాగ్యలక్ష్మి, సూపర్వైజర్ రమాదేవి, చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి రమాదేవి, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న, పీహెచ్సీ సూపర్వైజర్ వెంకటేశం, ఏఎన్ఎంలు వసంత, ఏ పద్మ, సత్యం, అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు పీ జయ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.