న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. విచారణను కొంతసేపు ఆపివేశారు. కపిల్ సిబల్కు సహాయం అందించారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూపై సుప్రీంకోర్టులో మూడో రోజైన గురువారం కూడా వాడివేడిగా విచారణ కొనసాగింది. కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు, పిటిషనర్స్ తరుఫున వాదిస్తున్న కపిల్ సిబల్ కనిపించలేదు. దీంతో సిబల్ న్యాయ బృందాన్ని ఆరా తీయగా ఆయన అస్వస్థత చెందినట్లు తెలిసింది.
కాగా, ఇది చూసి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఏం జరిగిందని మెహతాను అడిగారు. విచారణకు సంబంధం లేని విషయమని ఆయన చెప్పారు. విచారణ పునఃప్రారంభం కాగా, కొంత సేపటి తర్వాత కపిల్ సిబల్ కోర్టు గదిలోకి వచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేదన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి మెహతా తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు వీలుగా తన ఛాంబర్ను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. అలాగే సిబల్కు టీ, స్నాక్స్ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా సానుకూలంగా స్పందించారు. అస్వస్థత చెందిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు సహాయం కోసం ముందుకు వచ్చారు. విచారణను కొంతసేపు నిలిపివేశారు. సుప్రీంకోర్టు సమావేశ గదిలో కూర్చొని వీడియో లింక్ ద్వారా విచారణలో పాల్గొవాలని కపిల్ సిబల్కు సూచించారు. ఈ నేపథ్యంలో లంచ్ సమయం వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో ఆయన పాల్గొన్నారు. లంచ్ విరామం తర్వాత కోర్టు హాల్కు వచ్చిన కపిల్ సిబల్, ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూపై వాడిగా వాదనలు వినిపించారు.