హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరిగింది. 2021 ఏడాదికిగాను మొత్తం 119 మందికి రాష్ట్రపతి కోవింద్ పురస్కారాలను అందజేశారు. తెలంగాణ నుంచి గుస్సాడీ కళాకారుడు కనకరాజు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కుమరంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన ఆయన ఆదివాసీ సంప్రదాయమైన గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. సుమారు 55 ఏండ్లుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.
కనకరాజుతో పాటు ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామి(కళలు), అసవడి ప్రకాశ్రావు(సాహిత్యం, విద్య), నిడదవోలు సుమతి(కళలు) పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. వీరితోపాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంకు వచ్చిన రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్(మరణానంతరం)ను ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు. పద్మవిభూషణ్ అందుకున్న వారిలో ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూ, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, ఆర్కియాలజీ విభాగంలో ప్రొఫెసర్ బీబీ లాల్ ఉన్నారు. మొత్తం ఏడుగురు పద్మవిభూషణ్, 10 మంది పద్మభూషణ్, 102 మంది పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.
2020, 2021 సంవత్సరాలకు సంబంధించి పద్మ అవార్డులు పొందిన తెలుగు తేజాలను సమైక్య తెలుగు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవా) మంగళవారం ఘనంగా సత్కరించింది. ఢిల్లీలోని ఏపీ/టీఎస్ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, దళవాయి చలపతిరావు, గుస్సాడీ కనకరాజు, దండమూడి సుమతి రామ్మోహన్రావు, ఎడ్ల గోపాలరావు, ఆశావాది ప్రకాశ్రావు, పీవీ సింధు, ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు చరణ్లను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.