ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 23: ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో రూర్బన్ పథకంలో భాగంగా చేపడుతున్న పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో సాగుతున్నాయని, ప్రజాప్రతినిధులుగా తాము ఎవరిని అడగాలో అర్థం కావడంలేదని జాన్కంపేట్, కుర్నాపల్లి గ్రామాల ఎంపీటీసీలు మంద సంజీవ్, రాంరెడ్డి ఆరోపించారు. విద్యుత్శాఖ అధికారిని కింది స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారని, మండలంలో విద్యుత్కోతలకు సమయపాలన ఉండడం లేదని అధికారిని నిలదీశారు. వైద్యశాఖ సిబ్బంది గ్రామాల్లో ఉన్న సబ్ సెంటర్లలో విధులు నిర్వహించడం లేదని, ఉదయం 11 గంటల వరకు కూడా తాళాలు వేసి ఉంటున్నాయని వైద్యాధికారికి జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్ వివరించారు.
మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, మండల వైస్ చైర్మన్ ఇమ్రాన్ఖాన్, మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.