న్యూఢిల్లీ : రాజస్ధాన్లో నాయకత్వ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడితే ఆయన స్ధానంలో సచిన్ పైలట్ సీఎం పగ్గాలు చేపడతారనే వార్తలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. గెహ్లాట్ వర్గీయుడికే సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తూ 80 మందికి పైగా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పీసీ జోషీకి రాజీనామా లేఖలు అందచేశారు.
సచిన్ పైలట్ సీఎం అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వారు తేల్చిచెప్పారు. రాజస్ధాన్ కాంగ్రెస్లో పరిణామాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేతలు మల్లిఖార్జున్ కర్గే, అజయ్ మాకెన్లను పంపిన పార్టీ హైకమాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గెహ్లాట్, పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాధ్ను మధ్యవర్తిత్వం నెరపాలని నియమించింది.
పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఢిల్లీ చేరుకోనున్న కమల్ నాధ్ అధిష్టానంతో చర్చలు జరిపిన మీదట రాజస్ధాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు జైపూర్ వెళ్లనున్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమయంలోనూ ఆ రాష్ట్రంలో ఏఐసీసీ పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం కమల్నాధ్ను నియమించింది. మరోవైపు రాజస్ధాన్ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొనడంతో సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయబోరని భావిస్తున్నారు.