Kamal Hassan : దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ పార్టీ అధ్యక్షుడు (MNM party chief) కమల్ హాసన్ (Kamal Hassan) విద్యార్థులకు తన మద్దతు ప్రకటించారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ ‘ఎక్స్’లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుత విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని, దేశం తన బిడ్డలను నిరాశపరిచిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఒక చిన్నారి బాధపడినప్పుడే మనం స్పందించి ఉండాల్సింది. కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోయే వరకు వేచి చూశాం. బోధన స్థానాన్ని కోచింగ్, జిజ్ఞాస స్థానాన్ని ఆందోళన, ప్రతిభ స్థానాన్ని నేరాలు ఆక్రమించుకున్న ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయింది. విద్యార్థులకు సమాధానాలకు బదులు బారికేడ్లు, లాఠీలు ఎదురైనప్పుడు ఆ దేశం విఫలమైనట్లే’ అని కమల్ హాసన్ ఘాటుగా విమర్శించారు. సీజేపీ ఆధ్వర్యంలో ‘చలో సంసద్’ యాత్ర చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను ఉద్దేశించి.. ‘ముందుకు సాగాల్సిన ప్రయాణంలో దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దయచేసి మీ దీక్షను విరమించండి’ అని కమల్ విజ్ఞప్తి చేశారు. అనంతరం భారతీయ విద్యార్థులను ఉద్దేశించి.. ‘మీరే మాలో అత్యంత ఉత్తములు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు. ఇప్పుడు దేశం తన బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఈ నిరసనలకు నసీరుద్దీన్ షా, ప్రకాశ్ రాజ్, సల్మాన్ ఖాన్, మాధవన్, షబానా అజ్మీ, రాజ్కుమార్ రావు తదితర సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా కమల్ హాసన్ సైతం విద్యార్థులకు మద్దతు నిలిచారు.