కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్దేవ్గణ్ మధ్య హిందీ భాష విషయంలో చోటుచేసుకున్న ట్విట్టర్ వార్ భారతీయ సినీ పరిశ్రమలో ప్రకంపనల్ని సృష్టించిన విషయం తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలకు దక్షిణాది నటీనటుల నుంచి మద్దతు లభించింది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.తాజాగా హిందీ భాష గురించి అగ్ర నటుడు కమల్హాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని, తమిళ భాష వర్థిల్లాలన్నదే తన నినాదమని ఆయన అన్నారు. కమల్హాసన్ తాజా చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్హాసన్ హిందీపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ‘నేను హిందీని వ్యతిరేకించను. అదే సమయంలో తమిళంకు ఎవరైనా అడ్డుపడితే మాత్రం ఏ మాత్రం సహించను. ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమించాలి’ అన్నారు. కమల్హాసన్ వ్యాఖ్యలు దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.