తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి ( Ugra Srinivasamurthy ) ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారని ఆలయ అర్చకులు వెల్లడించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర్స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు పాల్గొన్నారు.