హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే 4 జాతీయ అవార్డులను గెలుచుకొన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ అవార్డుల్లో సంస్థల క్యాటగిరీలో సీపీడబ్ల్యూడీకి, రాష్ట్ర పీడబ్ల్యూడీ పీహెచ్డీ విభాగంలో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి లభించింది. ఇదే విభాగంలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం మెరిట్ సర్టిఫికెట్ పొందింది. భవనాల క్యాటగిరీలో డివిజనల్ రైల్వేజోన్ దవాఖానల విభాగానికి మొదటి బహుమతి, విజయవాడ ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్కు రెండో బహుమతి లభించింది. అవార్డులు రావడానికి కృషిచేసిన అధికారులందరికీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అభినందనలు తెలిపారు. ఈ నెల 14 నుంచి 21 వరకు నిర్వహించే 31వ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.