హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యామ్ 27 గేట్లను తెరిచి 1.77 లక్షల క్యూ సెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది.
జూరాల నుంచి వరద వస్తుండటంతో 1,49,917 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. సోమవారం సాయంత్రానికి ప్రాణహితకు 2.30 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 7.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని ఇతర ప్రాజెక్టులకు సైతం వరద స్వల్పంగా వస్తున్నది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
