న్యూఢిల్లీ, మార్చి 28: బంగారు ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. రూ.2,300 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ఈ ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ వాటాల విక్రయంతో వచ్చిన నిధుల్లో రూ.1,400 కోట్లను రుణాల తిరిగి చెల్లింపులు జరుపడానికి, అలాగే కొత్తగా మరో ఎనిమిది షోరూంలను ఏర్పాటు చేయడానికి రూ.463 కోట్లను ఫైనాన్స్ చేయనున్నట్లు ప్రకటించింది. కేరళ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జోయా లుక్కాస్కు దక్షిణ భారతం నుంచి 90 శాతం ఆదాయం సమకూరుతుండగా, మిగతాది పశ్చిమ భారతం నుంచి సమకూరుతున్నది. ఈ ఐపీవోకి లీడ్ మేనేజర్లుగా ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, మోతీలాల్ ఓశ్వాల్, ఎస్బీఐ క్యాపిటల్లు వ్యవహరిస్తున్నాయి.
దక్షిణాదిలో తనదైన ముద్ర వేసిన జోయాలుక్కాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే రెండేండ్లలో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటకల్లో 8 నూతన షోరూంలను ఏర్పాటు చేయబోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.471.75 కోట్ల లాభాన్ని గడించింది. అంతకు ముందు రూ.40 కోట్లతో పోలిస్తే పదింతలు పెరిగింది.