పెద్దపల్లి : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతున్నది. జిల్లాలోని మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని, ముత్తారం, మల్హర్, కాటారం మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా మహాదేవ పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
మంథని పట్టణంలోని రాజగృహలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సమక్షంలో పార్టీలో చేరగా.. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు.. నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ మధుకర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్కు అండగా నిలిచి.. ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.