నిజామాబాద్ : సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు యువజన సంఘాల సభ్యులు మెరుగు రాకేష్, సతీష్, మహేష్ ఆధ్వర్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు యువకులు బీఆర్ఎస్, కేసీఆర్కు మద్దతుగా ఉంటామని రావడం తనకు మరింత బలం చేకూరినట్లైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజక వర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పని చేసి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.