అయిజ, అక్టోబర్ 20 : ఆధునిక యుగంలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించుకుని పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం లో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మేళాకు కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరవగా.. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, శాస్త్రవేత్తలతో కలిసి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ రైతులు మూస పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక టెక్నాలాజీ, ఆధునిక యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. కొత్త పద్ధతిలో పంటలు సాగు చేయాలని, తక్కువ నీటితో ఎక్కువ ఫలసా యం అందించే వంగడాలను పండించాలని సూచించారు. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. యాసంగి సా గులో వేరుశనగ, ఆముదం, పెసర, మినుము, శనగ, మొ క్కజొన్న, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవ లు, జొన్న, నువ్వులు సాగు చేయాలన్నారు. రైతులకు ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు వినియోగించుకోవాలన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రైతులను లాభసాటిగా మార్చేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల నిపుణులతో అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తిరుమల్రెడ్డి, జిల్లా అధికారులు, యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మేళా ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రా మాల సర్పంచులు ఒక రోజు వేతనాన్ని హరితనిధికి ఇస్తున్నట్లు కలెక్టర్ సమక్షంలో ప్రకటించారు.
అన్నదాత సంక్షేమానికి చర్యలు : ఎమ్మెల్సీ కాటేపల్లి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కాటేపల్లి కోరారు. ఏ రా ష్ట్రంలో అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసి మద్దతు ధరను పొందాలన్నారు.
సేంద్రియ ఎరువులతోనే భూసార పరిరక్షణ : కృపాకర్రెడ్డి
రైతులు పంటల సాగును పాత పద్ధతిలోనే చేస్తుండడంతో దిగుబడులు తగ్గుతున్నాయని, భూసార పరీక్షలు చేయించి అందుకనుగుణంగా పంటలు సాగు చేయడంతోపాటు సేంద్రియ ఎరువులను వాడితే భూసార పరిరక్షణ సాధ్యమవుతుందని రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ కృపాకర్రెడ్డి సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడంతో భూసారం తగ్గి దిగుబడులు రావన్నారు.
రైతులు పోటీతత్వం విడనాడాలి : సుబ్బారెడ్డి
పంటల సాగులో రైతులు పోటీతత్వం విడనాడి పెట్టుబడులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించే దిశగా ప యనించాలని కోరమాండల్ ఫర్టిలైజర్ కంపెనీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి సూచించారు. రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేసి రసాయనిక మందులు అధిక శాతం ఉపయోగించడంతో దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. రసాయనిక ఎరువులు, మందులతోపాటు సేంద్రియ ఎరువుల వాడకం సమపాళ్లలో ఉండాలన్నారు. అలాగే జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ ఉద్యానవన యూనివర్సిటీ, కేవీకే శాస్త్రవేత్తలు రాంగోపాల్ వర్మ, కిరణ్ బాబు, విజయ్కుమార్, రామకృష్ణ బాబు, దివ్య రాణి, మ హేశ్వరమ్మ, నీలిమ, ప్రభాకర్రెడ్డి, అర్చన, మమత, రాజమణి, లావణ్య, హరికాంత్, భాస్కర్, రాజశేఖర్, రాజేందర్రెడ్డి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో అగ్రిబయోటెక్ ఫౌండేషన్ డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, డీఏవో గోవింద నాయక్, ఉద్యానశాఖ అధికారి సురేశ్, డీఆర్డీవో ఉమాదేవి, డీఈవో సిరాజుద్దీన్, మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్, పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, మార్కెట్ క మిటీ చైర్మన్ రాందేవ్రెడ్డి, జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే అబ్రహం
ఆరుగాలం కష్టపడి పంట పండించి ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతు దేశానికే వెన్నెముక అని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతుకు సాంకేతికంగా సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు మేళాతో ప్రయోజనం కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు దీటుగా పంటల సాగుపై అవగాహన కల్పించడం శుభపరిణామమన్నారు. మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకుముందు స్టాళ్లను ప్రారంభించారు.