సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్యం అందించి అనువైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు ఈజీయాక్ట్ సొల్యూషన్స్ స్టార్టప్ ఏర్పాటైంది. దీన్ని చాలా కాలంగా హ్యూమన్ రీసోర్స్ రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ దినేష్ మురుగేశన్ బుధవారం గచ్చిబౌలి సమీపంలోని కొత్తగూడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి చైర్మన్, ప్రముఖ సామాజిక కార్యకర్త మహ్మద్ సదీక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈజీయాక్ట్ అనేది వివిధ సంస్థలకు ప్రొఫెషనల్ సర్వీసులను అందించే కన్సల్టింగ్ కంపెనీగా పనిచేయనుంది. ఐటీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవలు అందించనుంది. స్త్రీ, పురుష బేధం లేకుండా సమానావకాశాలు అందించేలా సంస్థ కృషి చేయనుంది. నిరుద్యోగులను ప్రోత్సహించడం…వారి సామర్థ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుంది. నిరుద్యోగులను గుర్తించి వారికి ఉద్యోగ సమాచారం అందించడంతోపాటు జాబ్ పొందేవరకు కావాల్సిన సూచనలు చేయనుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఈజీయాక్ట్ డైరెక్టర్లు షణ్ముగప్రియ, రవీంద్రనాథ్, కస్తూరి, ఇంటెల్లిక్సా సంస్థ డైరెక్టర్లు లీనా కాంజివరం, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.