హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): నూతన జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం కే చంద్రశేఖర్రావు చెప్పారని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు. ఉద్యోగుల డీఏ బకాయిలను త్వరలోనే విడులచేస్తామని కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు.
టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సంఘం ప్రతినిధుల బృందం గురువారం ప్రగతిభవన్లో సీఎంను కలిసింది. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు రావడంలో జాప్యం వల్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి ప్రక్రియ ఆలస్యమైందని సీఎం అన్నట్టు తెలిపారు. మరింత జాప్యం జరగకుండా ఉద్యోగులు సహకరించాలని సీఎం కోరినట్టు చెప్పారు.
ఉద్యోగాల భర్తీ క్రమంలో ముందుగా కొత్త జిల్లాలకు ఆప్షన్లు తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయిస్తారని, అనంతరం ఏర్పడే ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారని మమత వెల్లడించారు. ఉద్యోగుల డీఏ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని మమత వివరించారు. సీఎంను కలిసినవారిలో టీజీవో నేతలు ఎస్ సహదేవ్, కృష్ణయాదవ్, జీ వెంకటేశ్వర్లు, బీ వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులున్నారు.