ముషీరాబాద్, నవంబర్ 24: ఆదాయ పన్ను పరిధిలోకి రాని అసంఘటిత కార్మికులు తమ పేర్లను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ జంటనగరాల జాయింట్ కమిషనర్ శ్యామ్సుందర్రెడ్డి కోరారు. సరైన అవగాహన లేక కార్మిక శాఖ ద్వారా అందుతున్న సంక్షేమ ఫలాలను అందుకోలేకపోతున్న అసంఘటిత కార్మికులకు జంటనగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నల్లగుట్టలో ఐఎఫ్టీయూ నాయకులు, కార్మిక సహాయ అధికారి పీవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఈ-శ్రమ్ కౌంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఆదాయ పన్ను పరిధిలోకి రాని 16 నుంచి 59 ఏండ్ల లోపు ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు, హమాలీలు, ఇతర విభాగాల కార్మికులు విధిగా ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ముందుకు రాని కార్మికుల కోసం వారి అడ్డాలకే వెళ్లి పేర్లు నమోదు చేస్తామన్నా రు. కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్మిక అధికారి పివి. రమణమూర్తి, హమాలీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శ్రీశైలం పాల్గొన్నారు.
4 కంపెనీలు..200 ఉద్యోగాలు
ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో రేపు జాబ్మేళా
సుల్తాన్బజార్, నవంబర్ 24: నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 26న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ఉపాధి కల్పన అధికారి ఎస్.మైత్రిప్రియ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి ఫుడ్స్, శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్టెక్, కెఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్లలోని కస్టమర్ కేర్, మార్కెటింగ్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించి 200ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని.. వీటికి పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 29సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అర్హులన్నా రు. పది నుంచి పదిహేను వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న విద్యానగర్ శివంరోడ్లోని బీఆర్సీ బిల్డింగ్లో నిర్వహించే జాబ్మేళాకు హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.