సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులకు మెరుగైన విద్యా విధానాన్ని అందించబోతుంది. ఇప్పటికే ఏఐ, ఎంఎల్, రోబొటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, డాటాసైన్స్ వంటి నూతన కోర్సులను ప్రవేశ పెట్టిన యూనివర్సిటీ.. వాటిలో విద్యార్థులు మరింత నైపుణ్యాలు మెరుగు పరుచుకోవడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం కోసం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్తో జేఎన్టీయూ హైదరాబాద్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. అకడమిక్, పరిశోధనలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఈ రెండు యూనివర్సిటీలు కలిసి పని చేయనున్నాయి. త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకోనున్నామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్ తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు వర్చువల్ తరగతులు
ఇంజినీరింగ్లో కోర్ సబ్జెక్టులు, సీఎస్ఈ, ఐటీ వంటి రెండు యూనివర్సిటీలలో అవసరమైన సబ్జెక్టుల బోధన కోసం వర్చువల్ క్లాస్రూమ్లు నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి ల్యాబ్లు కూడా విద్యార్థులు ఉపయోగించుకోనున్నారు. పరిశోధనా అంశాలు, ప్లేస్మెంట్ విషయంలో కూడా సహకారాలు ఇచ్చి పుచ్చుకోనున్నారు. మొత్తంగా ఈ రెండు టెక్నాలజీ యూనివర్సిటీల మధ్య అవగాహన కదుర్చుకోవడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగానే మారుతుందని రిజిస్ట్రార్ తెలిపారు.