శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఆదివారం కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. వరదల్లో నలుగురు మృతి చెందారని, ఒకరు సజీవంగా ఉన్నారని, మరొకరి ఆచూకీ దొరకడం లేదని పేర్కొన్నారు.
సదరు వ్యక్తి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (ఉత్తర కశ్మీర్ ) చెప్పారు. మృతులు రాజౌరీ జిల్లా నౌషెరా వాసులని పేర్కొన్నారు. మృతులు మహ్మద్ తారిఖ్ ఖారి (8), షహనాజా బేగం (30), నాజియా అక్తర్ (14), ఆరిఫ్ హుస్సేన్ ఖరీ (5)గా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తిని మహ్మద్ బషీర్ ఖరీ (80) కాగా.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. భారీ వరదలకు రఫియాబాద్ ప్రాంతంలోని వాటర్ గ్రామంలో పాఠశాలలతో సహా పంట పొలాలు, ప్రభుత్వ భవనాలను వరద నీరు ముంచెత్తింది.