student protests : జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన మరింత ఉధృతంగా కొనసాగనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలతోపాటు అనేక పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రాజధాని రాంచీలో నిరవధిక ఆందోళనకు దిగాయి. శనివారం ఈ ఆందోళనలు వరుసగా 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి ప్రధానంగా జేఎల్కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నాయకత్వం వహిస్తుండగా, రాష్ట్రంలోని ఇతర విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులతో సీఎం హేమంత్ సోరేన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. ముందుగా దేవేంద్ర నాథ్ మహతాతో, అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎన్ఎస్యూఐ, ఏసీఎస్, జేసీఎం వంటి సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇదే సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులతో కూడా చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థుల పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. అందులో ఈ పరీక్షల్ని పూర్తిగా రద్దు చేయాలని దేవేంద్ర నాథ్ మహతో డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే సమయంలో వేర్వేరు విద్యార్థి సంఘాలు, వేర్వేరు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ పేపర్ లీకేజీలపై సీఐడీ విచారణ జరపాలని, 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని, ఎన్టీయేలాగా జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ (జేటీయే) పేరుతో కొత్తగా పరీక్ష నిర్వహణా సంస్థ ఏర్పాటు చేయాలని.. ఇలా వేర్వేరు డిమాండ్లు ప్రభుత్వానికి వచ్చాయి. అయితే, వీటిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. కానీ, విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, వాటిని సీఎంకు తెలియజేస్తామని ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం తెలిపింది.
ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంపై విద్యార్థి సంఘాలు స్పందించాయి. తమ డిమాండ్లను ఈ నెల 10లోపు నెరవేర్చాలని తుది హెచ్చరిక జారీ చేశాయి. లేకుంటే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని చెప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా ఘెరావ్లు చేపడతామని హెచ్చరించాయి. రెండు వారాలకుపైగా విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. మరోవైపు దేవేంద్ర నాథ్ మహతో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా దీక్షలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో దేవేంద్రనాథ్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.