సైబర్ మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. ఊహించని ట్విస్ట్లతో నిలువు దోపిడీ చేస్తున్న వీరు.. తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చిక్కకుండా.. దొరక్కుండా ఇంట్లోనే ఏకంగా సొరంగాలను తవ్వుకుంటున్నారు. పోలీసులు పట్టుకునేందుకు వస్తే.. వీటి ద్వారా సురక్షిత ప్రదేశాలకు పారిపోతున్నారు. అంతేకాదు.. దృష్టి మళ్లించేందుకు నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. సొత్తు దొరక్కుండా.. దోచిన నగదును వాలెట్స్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా అమాయకులను కొల్లగొడుతున్న ఈ మాయగాళ్లు పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
జాంతారా, దేవ్ఘర్, ధన్బాద్ ప్రాంతాల్లో 10 వ తరగతి చదివిన యువకులంతా ఇప్పుడు కేవైసీ ఫ్రాడ్స్లో మునిగిపోయారు. అమాయకులను బుట్టలో వేసుకుని ఖాతాలను కొల్లగొడుతున్నారు. భారీగా డబ్బులు సంపాదించి.. పోలీసులకు చిక్కకుండా సరికొత్త ఐడియాలతో ఇండ్లను నిర్మించుకుంటున్నారు. వాటిని బయటి నుంచి చూస్తే ఓ పాత భవనంలా కనిపిస్తుంది. లోపల మాత్రం ఖరీదైన వస్తువులతో విలాసవంతంగా ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చినప్పుడు పట్టుపడకుండా ఇంటి ఆవరణ నుంచి బయటపడేందుకు సొరంగాలు తవ్వుకుంటున్నారు. అవి సుమారు 5 అడుగుల లోతు నుంచి 12 మీటర్ల దూరం వరకు ఉంటున్నాయి. ఇంటిని నాలుగు వైపులా చుట్టుముట్టినా.. వాటి ద్వారా తాపీగా బయటికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత కొండలు, గుటల్లోకి పారిపోతున్నారు. సాధారణంగా సైబర్ నేరగాళ్ల ఇండ్లు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉంటాయి. కేవైసీ మోసాలతో వేలాది మందిని మోసం చేస్తున్న ముఠాల అడ్డాలు జాంతారా, దేవ్ఘర్, ధన్బాద్ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లగా, వారి ఇండ్లలో ఈ సొరంగాలు కనబడటంతో అవాక్కయ్యారు. నిందితులు వీటిని ఎస్కేప్ రూట్స్గా వాడుకుంటున్నారని గుర్తించారు. మన పోలీసులు వెళ్లినప్పుడు సొరంగాల నుంచే బయటపడి పారిపోయినట్లు తెలిసింది.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సైబర్ క్రిమినల్స్ మరో తెలివైన నాటకానికి తెరలేపారు. రాత్రి సమయంలో వారు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టేస్తున్నారు. అంతకు ముందు ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పోలీసుల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు రాత్రి వేళ ఇండ్లలో కాకుండా వేరే చోట నిద్రిస్తున్నారు.
అరెస్ట్ను తప్పించుకోవడానికి ఐడియాలు వేస్తూనే.. దోచుకున్న సొమ్ము దొరకకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. అమాయకుడి నుంచి కొల్లగొట్టిన డబ్బును బ్యాంక్ ఖాతాల్లోకి వేసుకోగానే వాటిని ఈ కామర్స్ సైట్స్ లోని వాలెట్స్లోకి బదిలీ చేసుకుంటున్నారు. ఆ వాలెట్స్లో నుంచి ఖరీదైన సామగ్రిని కొనుగొలు చేస్తున్నారు. ఒక ఈ కామర్స్ సైట్ కాకుండా విదేశాలలో నుంచి నడుస్తున్న పేరొందిన ఈ-కామర్స్ సైట్లలో వాలెట్స్ను తెరుచుకుని వాటి ద్వారా దోచేసిన డబ్బును ఖర్చు చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సైబర్ క్రైం పోలీసులకు ఆ వాలెట్స్లను నిర్వహిస్తున్న వారి సమాచారం రావడానికి ఆలస్యమవుతుంది. ఆ లోపు వారు కాజేసిన సొత్తును వాడేసుకుంటున్నారు. ఇలా నేరస్తులు సైబర్ క్రైం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.