హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి రామస్వామి సంతోష్రెడ్డి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకుతో సత్తా చాటాడు. జనరల్(ఈడబ్ల్యూఎస్) కోటాలో జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. రాజస్థాన్కు చెందిన మృదుల్ అగర్వాల్ ప్రథమ ర్యాంకు సాధించాడు. అతనికి 360 మార్కులకు 348 వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్ మార్కుల్లో ఇదే రికార్డు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని మృదుల్ తెలిపాడు. బాలికల్లో కావ్యా చోప్రా ప్రథమ ర్యాంకు సాధించింది. ఢిల్లీ జోన్కు చెందిన ఆమెకు 360 మార్కులకు 286 వచ్చాయి. ఓవరాల్గా ఆమెకు 98వ ర్యాంకు లభించింది. జేఈఈ అడ్వాన్స్డ్లో ఈ ఏడాది మొత్తం 41,862 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది బాలికలు. మొదటి 100 ర్యాంకుల్లో ఐఐటీ బాంబే జోన్కు 28, ఐఐటీ ఢిల్లీ జోన్కు 28 ర్యాంకులు దక్కాయి. ఐఐటీ హైదరాబాద్ జోన్కి 27, ఐఐటీ రూర్కీ జోన్కి 13, ఐఐటీ కాన్పూర్ జోన్కి 3, ఐఐటీ ఖరగ్పూర్ జోన్కి ఒక ర్యాంకు లభించింది.
4 విభాగాల్లో హైదరాబాద్ జోన్కే టాప్ ర్యాంకులు
జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ 500 ర్యాంకుల్లో ఐఐటీ బాంబే తర్వాత ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే ఎక్కువ ఉండటం విశేషం. హైదరాబాద్ జోన్ నుంచి నందిగామ నిఖిల్ ఎస్సీ కోటా, బిజిలి ప్రచోతన్ వర్మ ఎస్టీ, గొర్లె కృష్ణచైతన్య ఓబీసీ (వికలాంగ) కోటాలో జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచారు. బాంబే ఐఐటీ జోన్ నుంచి 137 మంది టాప్ -500లో ఉండగా, హైదరాబాద్ జోన్ నుంచి 135 విద్యార్థులు ర్యాంకులు సాధించారు. బాలికల విభాగంలో హైదరాబాద్ జోన్లో టాపర్గా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పల్లె భావన నిలిచింది. భావన జాతీయ స్థాయిలో 107వ ర్యాంక్ సొంతం చేసుకోగా, మహిళల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది.
టాపర్ల చూపు.. ఐఐటీ బాంబే వైపు..
జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లలో చాలామంది బాంబే ఐఐటీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరతామంటున్నారు.
శ్రీచైతన్య విజయపతాక
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యాసంస్థలు విజయపతాక ఎగరేసినట్లు శ్రీచైతన్య, ఇన్ఫినిటీ లెర్న్ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ప్రకటించారు. కరోనాతో తాము ప్రారంభించిన ఆన్లైన్, ఆఫ్లైన్ విద్యావిధానం సత్ఫలితాలనిచ్చిందన్నారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో మృదుల్ 1వ ర్యాంక్, చైతన్య అగర్వాల్ 8, ఎం హృషికేష్ 10, ఎస్ దివాకర్సాయి 11 ర్యాంక్లను సొంతం చేసుకున్నట్లు సుష్మ ప్రకటించారు. ఇక టాప్ 10లో 9, 100లో 93, టాప్ 1000లో 436 ర్యాంక్లతో మొత్తంగా 2,569 ర్యాంక్లు సాధించినట్లు తెలిపారు.
గురుకుల విద్యార్థుల హవా
జేఈఈ అడ్వాన్స్డ్లో గిరిజన గురుకుల విద్యార్థులు విజయపతాక ఎగురవేశారు. గిరిజన గురుకులాల్లో చదివిన దాదాపు 45 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించే అవకాశాలున్నాయని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విదార్థులను, వారి తల్లిదండ్రులను రొనాల్డ్ రోస్తోపాటు అడిషనల్ సెక్రెటరీ నవీన్ నికోలస్ అభినందించారు.
ప్రచారకర్తగా అల్లు అర్జున్..
శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రచారకర్తగా నటుడు అల్లు అర్జున్ వ్యవహరించనున్నట్టు సుష్మ ప్రకటించారు. ఈ మేరకు తమ విద్యాసంస్థతో అల్లు అర్జున్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. అల్లు అర్జున్ వంటి గొప్ప నటుడు తమ విద్యాసంస్థలకు ప్రచారకర్తగా ఉండటం ద్వారా తమ మార్కెట్ బలపడుతుందని సుష్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
బాంబే ఐఐటీలో చేరతా
మాది ఒంగోలు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జేఈఈ కోసం రోజుకు 10 గంటలు కష్టపడ్డా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోర్సులో చేరతాను. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతాను.
స్టార్టప్ పెడతా
మాది శ్రీకాకుళం. నాన్న బ్యాంక్ ఉద్యోగి. రోజుకు 14 గంటల కష్టపడి చదివాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరతా. స్టార్టప్గా ఇన్నోవేటర్లను ప్రోత్సహించాలన్నది నా లక్ష్యం. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత స్టార్టప్ పెడతా.
పేరు జాతీయర్యాంకు
రామస్వామి సంతోష్ రెడ్డి 4
పోలు లక్ష్మీ సాయిలోకేష్ రెడ్డి 5
మోదుల్ల హృషికేశ్ రెడ్డి 10
సవరం దివాకర్సాయి 11
ఆనంద్ నర్సింహన్ 17
హైదరాబాద్ జోన్ పరిధిలో ర్యాంకర్లు
కోటా ర్యాంక్ పేరు
జనరల్ 1 సంతోష్రెడ్డి
(ఈడబ్ల్యూఎస్ )
ఎస్సీ 1 నందిగామ నిఖిల్
ఎస్టీ 1 బిజిలి ప్రచోతన్ వర్మ
ఓబీసీ 1 గొర్లె క్రిష్ణచైతన్య
(వికలాంగ)