పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్లోని జేడీయూ పరివారం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. జేడీయూపై కమళదళం ఎదురుదాడికి దిగడంతో అక్కడి జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జేడీయూ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది. 51 సీట్లలో బీజేపీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టనున్నట్టు వెల్లడించింది. అశోకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీతో కలిసి పోటీచేస్తే కుర్మీలు, కుష్వాహు వర్గాల నుంచి తలనొప్పులు రావొచ్చన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. బీహార్లో ఒకవేళ బీజేపీ మద్దతును ఉపసంహరించుకొంటే, నితీశ్కు తాము మద్దతు ఇస్తామని ఆర్జేడీ ఇప్పటికే పరోక్ష సంకేతాలు పంపింది.