మంగపేట, మార్చి31: రాజుపేట సమీప లక్ష్మీనర్సాపురంలో జరుగుతున్న శ్రీనాగులమ్మ జాతరలో భాగంగా బుధవారం పూజారులు, వడ్డెలు ఎర్రెట్టల గుట్ట నుంచి సడాలమ్మను గుడికి తీసుకొచ్చారు. అనంతరం గోదావరి జలాలలో అభిషేకాలు చేసి సమ్మక్క గద్దె వద్ద ప్రతిష్ఠించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఆర్ఐ కామేశ్వర్రావు సిబ్బందితో నాగులమ్మ గుడి వద్దకు చేరుకొని ఆలయ ప్రాంగణంలో గద్దెలు, పరిసరాలు పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. గురువారం గండోర్రెగుట్ట నుంచి నాగులమ్మ ఆగమనం ఉంటుందని పూజారులు, వడ్డెలు తెలిపారు. నాగులమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు బాడిశ రామకృష్ణస్వామి, ప్రధాన పూజారి బాడిశ నాగరమేశ్, నవీన్, గిరిజన కుల పెద్దలు పాల్గొన్నారు.